ములుగు : గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రూ. 90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్రోడ్డు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నడ గ్రామానికి చెందిన వెంబటి రాజశేఖర్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఈనెల 24వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతుగూడెం అటవీ ప్రాంతానికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేశాడు.
25వ తేదీన మంగపేట మీదుగా రవాణా చేస్తుండగా.. తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ తాహెర్ బాబా గంజాయి రవాణా చేస్తున్న వాహనం తోపాటు గంజాయి, ఓ సెల్ ఫోను సీజ్ చేసి రాజశేఖర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.