షాద్నగర్ : ఓ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందపడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జార్కండ్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్రాయ్ (48) అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 44 సమీపంలో గల సందర్శిని హోటల్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
గజ్వేల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న క్రమంలో టీఫిన్ చేసేందుకు సందర్శిని హోటల్ వద్ద నిలిపారు. అనంతరం బస్సును వెనుకకు తీస్తుండగా డ్రైవర్ సెక్యూరిటీ గార్డును గమనించకపోవడంతో బస్సు వెనుక టైర్ల కిందపడి లక్ష్మణ్రాయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక సర్కారు దవాఖానకు తరలించారు. వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.