ATM stolen | ఏటీఎంకు రక్షణగా నిలిచిన ఓ గార్డు.. గర్ల్ఫ్రెండ్ను పెండ్లి చేసుకోవడానికి అదే ఏటీఎంను దోచుకున్నాడు. ఏటీఎంలోని నగదుతో పాటు సెక్యూరిటీ గార్డు కనిపించకపోవడంతో సదరు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెక్యూరిటీ గార్డే దొంగగా నిర్ధారించారు. దొంగతనం చేసింది కూడా తన గర్ల్ఫ్రెండ్ను పెండ్లి చేసుకోవడానికే అని పోలీసులు తేల్చారు.
బెంగళూరు విల్సన్ గార్డెన్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో గార్డు ఏటీఎం మిషన్కు అసోంకు చెందిన 23 ఏండ్ల దీపోంకర్ నోమోసుద్ర గార్డుగా విధుల్లో ఉన్నాడు. తన ప్రియురాలిని పెండ్లి చేసుకునేందుకు కావాల్సినంత డబ్బు తన వద్ద లేకపోవడంతో ఏటీఎంను దోచుకోవాలని ప్లాన్ వేశాడు. కొద్దిరోజుల క్రితం క్యాష్ లోడింగ్ సిబ్బందితో స్నేహం చేసిన ఇతగాడు.. ఏదో సాకుతో అతడి డైరీలో ఉన్న ఏటీఎం క్యాష్ క్యాసెట్ ఓపెన్ చేసేందుకు పాస్వర్డ్ను తెలుసుకున్నాడు. నవంబర్ 17 వ తేదీన రాత్రి 7-8 గంటల మధ్య పాస్వర్డ్తో ఓపెన్ చేసిన గార్డు.. అందులో నుంచి రూ.20 లక్షలు ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు దొంగతనం గుర్తించిన బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అసోంలోని ఇంట్లో నుంచి అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.14.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఏటీఎం నుంచి నగదు దొంగిలించిన సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కెమెరాలో చిక్కినా కూడా తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు లైట్లు ఆఫ్ చేసి బట్టలు మార్చుకున్నాడు. నిందితుడిని విచారించగా, ఏటీఎంను దోపిడీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, తన ప్రియురాలిని పెండ్లి చేసుకునేందుకు కావాల్సిన ఖర్చులకు తన వద్ద డబ్బులు లేవని, అందుకే ఈ దొంగతనాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల ఎదుట వెల్లడించాడు. దొంగిలించిన డబ్బులో నుంచి స్నేహితులకు రూ.5 లక్షలతో పార్టీ ఇచ్చాడు. మిగతా డబ్బుతో ఓ ఇంటిని కట్టుకుని, చిన్న హోటల్ ప్రారంభించి భార్యతో హాయిగా ఉండాలని అనుకున్నాడంట ఈ దొంగగారు. ప్రియురాలితో పెండ్లి సంగతి దేవుడెరుగు.. ప్రస్తుతం ఈయన మాత్రం జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.