వెంగళరావునగర్ : అతను చూస్తే చాలా సామాన్యుడిగా, బుద్ధిమంతుడిగా కనిపిస్తాడు. కానీ చేసేదంతా మోసమే. బంగారు పూత పూసిన వెండి నగలను బంగారు నగలుగా నమ్మించి ఏకంగా రూ. 6 కోట్ల వరకు మోసం చేసిన ఘనుడు కటకటాల పాలయ్యాడు.
వెండికి బంగారపు పూత పూసి హాల్ మార్కు ముద్రతో నగరంలోని సుమారు 200 మంది బంగారు నగల వ్యాపారుల ను, పాన్ బ్రోకర్లను బురిడి కొట్టించాడు ఆ మోసగాడు. అతని చేతుల్లో మోసపోయిన నగల షాపుల నిర్వహాకులు కేసు పెట్టేందుకు ఎస్.ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో బారులు తీరడం గమనార్హం.
ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-1 కమాన్ సమీపంలో పాన్బ్రోకర్, బంగారు నగల వ్యాపా రం చేస్తున్న గణేష్ దగ్గరకు రెండెండ్ల కింద కబీర్ నగర్కు చెందిన వెంకట్రెడ్డి (59) అనే వ్యక్తి వచ్చాడు. తన వద్ద 7 గ్రాముల బంగారు ఉంగరం ఉందంటూ చెప్పి వ్యాపారికి చూపించాడు. అక్కడికక్కడే ఉంగరాన్ని గీకి పరీక్షించిన గణేష్ దరి అది బంగారమని నమ్మాడు. పైగా ఉంగరం పై బంగారు స్వచ్ఛతను సూచించే హాల్మార్కు ముద్రకూడా ఉంది. దీంతో ఉంగరాన్ని తాకట్టు పెట్టుకుని రూ.16000 ఇచ్చాడు.
అనంతరం మళ్లీ గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఆగస్టులోనూ మరో రెండు ఉంగరాలను తీసుకువచ్చి రూ.22000, రూ19000 చొప్పున తీసుకున్నాడు. ఉంగరాలను తాకట్టుపెట్టిన నిందితుడు వెంకటరెడ్డి వాటిని విడిపించుకోవడానికి రాలేదు. సమయం దాటడంతో నిబంధనల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారు ఉంగరాలను కరిగించేందుకు ప్రయత్నించగా అవి వెండి ఉంగరాలని తేలింది. గీసినా గుర్తించలేనంతగా పైన బంగారు పూత, హాల్ మార్క్ ముద్రతో నిందితుడు ఈ తరహా మోసానికి పాల్పడ్డాడు.
ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే 18 చోట్ల బంగారు నగర వ్యాపారుల వద్ద నగలు తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. నగరంలో 200 పైగా పాన్ బ్రోకర్లు , నగల వ్యాపారుల వద్ద ఈ తరహా డూప్లికేటు ఉంగరాలు, తాళిబొట్లు వంటి ఆభరణాలను నిందితుడు తాకట్టు పెట్టి కోట్లల్లో డబ్బులు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కాగా గతనెల 29న మరో ఉంగరంతో అదే షాపుకు వచ్చిన వెంకటరెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వెంకటరెడ్డి వెనుక నకిలీ నగలు తయారు చేసేముఠా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.