చెన్నై: బ్యాంకు సిబ్బందిని టాయిలెట్లో బంధించిన దొంగలు, కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. అరుంబాక్కం ప్రాంతంలోని బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చే ఫెడ్బ్యాంక్ బ్రాంచ్లోకి శనివారం సాయంత్రం మాస్కులు ధరించిన ముగ్గురు ప్రవేశించారు. బ్యాంకు సిబ్బందిని బెదిరించి వారిని టాయిలెట్లో బంధించారు. వినియోగదారులు తనఖా పెట్టిన బంగారాన్ని ఉంచే స్ట్రాంగ్ రూమ్ తాళాలు వారి నుంచి తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ తెరిచి అందులో ఉన్న సుమారు 32 కేజీల బంగారాన్ని పాలిథిన్ సంచుల్లో వేసుకుని పారిపోయారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఆ బ్యాంకుకు వెళ్లి పరిశీలించారు. అక్కడ పని చేసే వ్యక్తి తనకు కూల్ డ్రింక్ ఇవ్వడంతో తాగానని, అనంతరం అపస్మారక స్థితికి వెళ్లినట్లు సెక్యూరిటీ గార్డు తెలిపాడు. దీంతో ఆ బ్రాంచ్లో పని చేసే వారే బంగారం చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఆ బ్రాంచ్ను శనివారం మూసివేశారని, లెక్కల కోసం కొంత మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ తెలిపారు. దోచుకున్న బంగారం విలువ కోట్లలో ఉంటుందని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.