స్టేషన్ ఘన్పూర్/జనగామ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ మహిళా కూలీ మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు..స్టేషన్ ఘన్పూర్ నుంచి జఫర్గడ్ మండలం కునూరు గ్రామానికి పత్తి తీసేందుకు రెండు ఆటోల్లో మహిళా కూలీలు వెళ్తున్నారు.
ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ వేగంగా వెళ్లి తొమ్మిది మంది కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోడెం కల్పన(35)ను స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా సకాలంలో వైద్యం అందక కల్పన మృతి చెందింది.
ఆమెతో పాటు గాయపడిన ఆటో డ్రైవర్తో పాటు పలువురు గాయపడిన కూలీలకు ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.