అమరావతి : ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం బ్రహ్మణపల్లె గ్రామానికి కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ,18 మందికి తీవ్రగాయాలయ్యాయి. పొలాల్లో పత్తి తీసేందుకు కూలీలు మినీ ఐచర్ లారీలో వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం చుక్కలూరు వద్ద బోల్తా పడింది. గాయపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలో ఉన్న తాడిపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు.