ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోని ఖౌజ్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 19 మందితో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఒకే గ్రామానికి చెందిన 19 మంది రాబుంగ్ గ్రామంలో మరణించిన తమ బంధువు అంత్యక్రియల కోసం ఓ ట్రక్కు మాట్లాడుకుని వెళ్తుండగా ఈ ఉదయం 9.30 గంటలకు రాబుంగ్కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.