జైపూర్ : తన కుమారుడిపై నమోదైన లైంగిక దాడి కేసులో స్వేచ్ఛగా, సజావుగా దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని రాజస్ధాన్ మంత్రి మహేష్ జోషీ వ్యాఖ్యానించారు. మంత్రి కుమారుడు రోహిత్ జోషి గత ఏడాది జైపూర్, ఢిల్లీలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని 23 ఏండ్ల మహిళ ఆదివారం ఆరోపించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మంత్రి కుమారుడు రోహిత్ జోషీపై జీరో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
గత ఏడాది జనవరి 8 ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య మహిళపై పలుమార్లు రోహిత్ జోషీ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి కుమారుడిపై ఆరోపణలు రాజస్ధాన్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై మౌనాన్ని వీడిన మంత్రి మహేష్ జోషీ తన కుమారుడు తప్పు చేసినట్టు రుజువైతే అతడిపై చర్యలు తీసుకుంటే తనకు సమస్య లేదని చెప్పుకొచ్చారు.
ఈ ఆరోపణల వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే దానిపై ఈ దశలో తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు. మరోవైపు మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో రోహిత్ జోషీపై పలు సెక్షన్ల కింద ఉత్తర ఢిల్లీలో కేసు నమోదైంది.