భోపాల్ : ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.. వికృత చర్యలకు పాల్పడ్డారు. దిండ్లతో శృంగారం చేయాలని వేధించారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దుర్భషలాడారు సీనియర్లు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో వెలుగు చూసింది.
ఎంబీబీఎస్ చదువుతున్న సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను తమ గదుల్లోకి పిలిపించుకున్నారు. ర్యాగింగ్ పేరిట జూనియర్లను ఘోరంగా అవమానించారు. ఈ అవమానాన్ని భరించలేక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్ నంబర్కు జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సిరీయస్గా తీసుకున్న యూజీసీ.. విచారణకు ఆదేశించింది.
తమను గదుల్లోకి పిలిపించుకున్న సీనియర్లు.. దిండ్లతో శృంగారం చేయాలని బలవంతం చేశారని జూనియర్లు వాపోయారు. తమ బ్యాచ్కు చెందిన ఏదో ఒక అమ్మాయి పేరును ఎంచుకొని.. అవమానకరంగా తిట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఒకరికొకరు కొట్టుకోవాలని బలవంతం చేసినట్లు జూనియర్ విద్యార్థులు పేర్కొన్నారు. తమ మొబైల్ ఫోన్లను లాక్కొని.. గుంజిలు తీయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేధింపులకు పాల్పడిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. జూనియర్లను సీనియర్లు వేధించింది నిజమేనని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ కేసును పోలీసులకు అప్పగించారు. యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 తో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.