సిద్దిపేట : ఓ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ పేలిపోవడంతో.. ఓ గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని పెద్ద చీకోడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్ద చీకోడు గ్రామానికి చెందిన పుట్ట లక్ష్మీనారాయణ తన ఎలక్ట్రిక్ మోపెడ్ వాహనాన్ని పక్కనే ఉన్న దుర్గయ్య గుడిసె వద్ద మంగళవారం రాత్రి పార్కు చేశాడు. బుధవారం తెల్లవారుజామున ఆ వాహనం బ్యాటరీ పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి గుడిసెకు అంటుకున్నాయి. క్షణాల్లోనే గుడిసె పూర్తి కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దుర్గయ్య కుటుంబ సభ్యులు గుడిసెకు కొద్ది దూరంలో నిద్రిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.