అమరావతి : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు విహారయాత్ర కోసం టూరిస్ట్ బస్లో కేరళకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది వరకు ఉన్నారు. బస్సు నందిగాం మండలం పెద్దతామరాపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టగా.. బస్సు బోల్తా పడింది. ఘటనలో 22 మందికి గాయలవగా.. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. నందిగాం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.