భోపాల్ : ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. మార్క్స్ మెమో ఇవ్వట్లేదని ప్రిన్సిపల్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు విద్యార్థి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బీఎం ఫార్మసీ కాలేజీలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అశుతోష్ శ్రీవాత్సవ అనే విద్యార్థి గతేడాది బీ ఫార్మసీ పూర్తి చేశాడు. అయితే మార్క్స్ మెమో ఇవ్వకుండా ఆ విద్యార్థిని ప్రిన్సిపల్ విముక్త శర్మ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థి కాలేజీ వద్దకు చేరుకున్నాడు. ప్రిన్సిపల్, విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ప్రిన్సిపల్పై పోసి నిప్పంటించాడు. అనంతరం విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ అతన్ని పోలీసులు రక్షించాడు.
ప్రిన్సిపల్ 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అశుతోష్ కూడా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అయితే కొద్ది నెలల క్రితం ఇదే కాలేజీకి చెందిన ఫ్యాకల్టీపై అశుతోష్ కత్తితో దాడి చేసి జైలు పాలయ్యాడు. వారం రోజుల క్రితం బెయిల్పై విడుదలై ఈ దారుణానికి ఒడిగట్టాడు.