ముంబై : ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా అశ్లీల వీడియో ప్రత్యక్షం కావడంతో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుణేలోని రాజ్గురునగర్లో ఐదవ తరగతి విద్యార్ధుల కోసం ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహించిన ఆన్లైన్ క్లాస్లో శుక్రవారం మధ్యాహ్నం అశ్లీల వీడియో స్క్రీన్లపై కనిపించింది. ఈ వీడియోతో కూడిన ఆన్లైన్ క్లాస్ లింక్ను పాస్వర్డ్తో విద్యార్ధులకు షేర్ చేశారు. బయటివ్యక్తలు ఈ లింక్ను ఫార్వర్డ్ చేశారని తాము అనుమానిస్తున్నామని ఖేడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ గౌరవ్ తెలిపారు.
అశ్లీల వీడియో క్లిప్ కనిపించగానే సెషన్ నుంచి విద్యార్ధులు లాగవుట్ అయ్యారు. క్లాస్లో ఈ వీడియో ప్లే అవడం గమనించిన కొందరు విద్యార్ధుల తల్లితండ్రులు స్కూల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియో క్లిప్ ప్లే అయిన సమయంలో ఆన్లైన్ క్లాస్లో 30 మంది విద్యార్ధులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.