ఆసిఫాబాద్: జిల్లాలో భారీగా కల్తీమద్యం పట్టుబడింది. చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్సినిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని, దానిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గ్రామానికి చెందిన దండిగ శంకర్, తోడేటి రాజేష్ ఇండ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఖరీదైన మద్యం బాటిళ్లను సేకరించి.. వాటిలో చీప్ లిక్కర్, నీళ్లు కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని తెలిపారు. వాటిని మహారాష్ట్రలోని గూడెం, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. వారివద్ద కల్తీ మద్యం సీసాలు, ఆటో, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.77,550 ఉంటుందని చెప్పారు.