ముంబై : మహారాష్ట్రలోని పుణేలో కలకలం రేపిన 13 ఏండ్ల బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆరుగురు ఆటో డ్రైవర్లు, ఇద్దరు రైల్వే ఉద్యోగులు సహా మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆగస్ట్ 31 రాత్రి తన ఫ్రెండ్ను కలిసేందుకు బాలిక రైల్వే స్టేషన్కు వెళ్లగా ఎంతసేపటికి ఫ్రెండ్ రాకపోవడంతో వెనుదిరిగేందుకు సిద్ధమైంది.
బాలిక ఒంటరిగా ఉండటం గమనించిన ఆటో డ్రైవర్లు ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి ఆటోలో ఎక్కించుకున్నారు. బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్లు ఆపై ఇద్దరు రైల్వే ఉద్యోగులను అక్కడికి పిలిపించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి బాలికను పలు ప్రాంతాలు తిప్పిన నిందితులు మరికొందరితో కలిసి దారుణానికి తెగబడి ఓ ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్లారు.
రైల్వే స్టేషన్కు వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాకపోవడంతో బాధితురాలి తండ్రి పుణే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి బాలికను గుర్తించి దవాఖానకు తరలించారు. బాలిక పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశామని పోలీసులు తెలిపారు.