నాంపల్లి: పదమూడేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యెడ్ల రమేశ్ (43) అనే నిందితుడికి నాంపల్లి ఒకటవ అదనపు ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది. జస్టిస్ బి.సురేష్ ఈ తీర్పును వెలువరించారు. పోక్సో చట్టంతోపాటు ఐపీసీ, అట్రాసిటీ చట్టాల ప్రకారం జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు. 2018 లో సైఫాబాద్లో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
2018 జూన్ 16న తమకు పరిచయమున్న యెడ్ల రమేష్ అనే వ్యక్తి తన కూతురిని బిర్లా టెంపుల్ దగ్గర ఉండమని చెప్పాడని, అక్కడి నుండి బలవంతంగా బషీర్ బాగ్లోని తన రియల్ ఎస్టేట్ ఆఫీసుకు తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్య తీసుకోవాలని కోరింది.
మైనర్ దళిత బాలికపై అత్యాచారం చేసినందుకు అతనిపై పోక్సో చట్టం, ఐపీసీ, అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అనంతరం చార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ బాలిక తరఫున వాదనలు వినిపించారు.
సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో అందరు సాక్షులను విచారించిన మొదటి అదనపు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సురేష్ తీర్పు వెలువరించారు. నేరం రుజువైందని చెప్పిన ఆయన.. నిందితుడికి జీవిత ఖైదు, ఇరవై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అదే విధంగా నిందితుడికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.