Aurangabad | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్లో కాలుతూనే తాను ప్రేమిస్తున్న యువతుని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో యువతి, యువకుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
పోలీసు అధికారి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గజానన్ ముండే అనే యువకుడు, యువతి ఇద్దరూ మరఠ్వాడ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ముండే తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సదరు యువతి తనను అన్ని విధాలా వాడుకుందంటూ గజానన్ ముండే ఆరోపించాడు. ఈ నేపథ్యంలో యువతి ల్యాబ్లో ప్రాజెక్ట్ చేస్తుండగా.. అక్కడికి వెళ్లిన గజానన్ క్యాబిన్ తలుపులు మూసివేశాడు.
అనంతరం తనతోపాటు తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాటిళ్లలో ఒకటి తనపై పోసుకుని మరొకటి యువతిపై పోసి నిప్పంటించుకున్నాడు. అనంతరం మంటల్లో కాలుతూనే యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో అతనికి 80 శాతం, యువతికి 50శాతం కాలిన గాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బేగంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రశాంత్ వెల్లడించారు.