న్యూఢిల్లీ : విధి రాత బలీయమైనదని, ఎవరూ మార్చలేరని అంటారు. దేశ రాజధానిలో వెలుగుచూసిన ఉదంతం అందరి హృదయాలను మెలిపెడుతోంది. ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్, 30 ఏండ్ల పీహెచ్డీ విద్యార్ధి ఆష్రఫ్ నవాజ్ ఖాన్ లండన్లో తన డ్రీమ్ జాబ్ దక్కించుకుంటాననే ఆనందంలో తేలియాడుతుండగానే క్షణాల్లో విగతజీవిగా మారాడు. మంగళవారం రాత్రి ఐఐటీ ఢిల్లీ సమీపంలో వేగంగా దూసుకెళుతున్న కారు ఢీ కొట్టడంతో రోడ్డు దాటుతున్న ఆష్రఫ్ నవాజ్ ఖాన్ మరణించాడు. ముగ్గురు చెల్లెళ్లకు అతడు ఒక్కడే సోదరుడు కాగా తండ్రి ఇటీవల బ్రెయిన్ హ్యామరేజ్తో తండ్రి మరణించాడు.
తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం మోసేందుకు సిద్ధమయ్యాడు. తాను అనుకున్నట్టుగానే లండన్లో జాబ్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేశాడు. కోరుకున్న కొలువును దక్కించుకున్న సంతోషంలో ఫ్రెండ్స్కు పార్టీ ఏర్పాటు చేశాడు. అనుకోకుండా విషాదం ముంచెత్తడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడి మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన దుస్ధితి ఎదురైంది. ఆష్రఫ్ మృతిపై అతడి మేనత్త ఆవేదన వ్యక్తం చేస్తూ అసలు రాత్రి వేళ మద్యం మత్తులో వాహనాలను నడిపేవారు ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆందోళన చెందారు.
నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్డీఏ మార్కెట్లో డిన్నర్ పూర్తయిన తర్వాత ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్లు ఆష్రఫ్, అంకుర్ శుక్లా మంగళవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో గేట్ నెంబర్ 1 వద్ద రోడ్డు దాటుతుండా అతివేగంగా వచ్చిన కారు వారిని ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సప్ధర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాన్ మరణించగా, కాలు ఫ్రాక్చరైన శుక్లా మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో కారును వదిలేసి నిందితులు పరారయ్యారు.