చార్మినార్ : మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ యువతను మత్తుమందుకు బానిసలుగా మారుస్తున్న వ్యక్తిపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీ యాక్ట్ను ప్రయోగించారు. నల్గొండ జిల్లా కు చెందిన మహ్మద్ ఖాదర్ (27) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి చేరుకుని ఓల్డ్ మలక్పేట్లోని రేస్కోర్స్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
నిందితుడు గతంలో పలుమార్లు గంజాయి అక్రమ అమ్మకాలు చేపడుతూ పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపిన చరిత్ర కలిగి ఉన్నాడు. జైలునుండి బయటకు వచ్చిన తరువాత నిందితుడు పాత పద్దతిలోనే జీవనం గడుపుతూ ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి, హషీష్ వంటి మత్తు పదార్థాలు అమ్ముతూ మత్తుకు బానిసలుగా మారుస్తున్నాడు.
నిందితుని నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న ఫలక్నుమా పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంధర్ మహ్మద్ ఖాదర్పై పీడీ యాక్ట్ను ప్రయోగించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు సిఫార్సు చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఖాదర్పై పీడీ యాక్ట్ను ప్రయోగించారు.