హైదరాబాద్ : నగరంలోని లంగర్హౌజ్లో ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి రూ.8.65 లక్షల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఓ కారు, ఓ మోటారు సైకిల్, ల్యాప్టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను వట్టేపల్లికి చెందిన సయ్యద్ జమురుద్దీన్, కుల్సుంపురకు చెందిన ఖాజా అసీం అహ్మద్, టోలిచౌకీకి చెందిన మహ్మద్ షాజబ్, కిషన్బాగ్కు చెందిన అజాంఖాన్గా గుర్తించారు. మరో ముగ్గురు సయ్యద్ అజారుద్దీన్, సయ్యద్ జహిరుబ్దిన్, తెహిరుద్దీన్ పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు అన్నదమ్ములు సయ్యద్ అజార్, జహీర్, జమీర్ ఇతరులతో కలిసి గ్యాంగ్గా ఏర్పడి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 17 వెబ్సైట్లను సృష్టించి బెట్టింగ్లో పాల్గొనే విధంగా నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అన్ని చెల్లింపులు, రసీదులు ఆన్లైన్ బ్యాంక్ బదిలీల ద్వారా చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మొత్తం 500 మంది పాల్గొన్నట్లు హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ డీసీపీ పి. రాధా కృష్ణా రావు తెలిపారు. క్రికెట్, పేకాట, క్యాసినో, ఫుట్బాల్, టెన్నిస్, తదితర 100 రకాల గేమ్స్పై వీరు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.