న్యూఢిల్లీ: రక్షా బంధన్ ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు బైక్పై వెళ్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డాడు. చైనా మాంజా వల్ల గొంతు తెగడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నాగ్లోయ్లోని రాజధాని పార్క్ ప్రాంతంలో 35 ఏళ్ల విపిన్ కుమార్ నివసిస్తున్నాడు. శుక్రవారం రక్షా బంధన్ సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకోవాలని అనుకున్నాడు. సోదరి ఉండే లోని ప్రాంతానికి భార్యతో కలిసి బైక్పై బయలుదేరాడు.
కాగా, శాస్త్రి పార్క్ ఫ్లైఓవర్పై బైక్పై వెళ్తున్న విపిన్ కుమార్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో అతడి గొంతు తెగింది. తీవ్రంగా గాయపడిన విపిన్ కుమార్ను అతడి భార్య స్థానికుల సహాయంతో సివిల్ లైన్స్లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలో చైనా మాంజా వల్ల ఈ నెలలో ఇద్దరు మరణించారు. 2016 ఆగస్ట్ 15న కార్ల పైటాప్ నుంచి బయటకు చూస్తున్న ఇద్దరు పిల్లల మెడకు చైనా మాంజా చుట్టుకోవడం వల్ల గొంతులు తెగడంతో చనిపోయారు. ఈ సంఘటనల అనంతరం ఢిల్లీలో చైనా మాంజాను నిషేధించారు. అయినప్పటికీ గాలి పటాలు ఎగుర వేసేవారు గాజు పూతతో కూడిన దారాన్ని (చైనా మంజా) అక్రమంగా వినియోగిస్తున్నారు.