లక్నో : యూపీ రాజధాని లక్నో మెదాంత ఆస్పత్రి లో పనిచేసే నర్సు (21) మృతదేహం అనుమానాస్పద స్ధితిలో లభ్యం కావడం కలకలం రేపింది. గోమతినర్ భాగీరధి అపార్ట్మెంట్స్ పార్కింగ్ ప్రదేశంలో నర్సు మృతదేహాన్ని గుర్తించారు. అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి పడిపోవడం వల్ల నర్సు మరణించిందని, ఆమె మరణం అనుమానాస్పదంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలి దుస్తులు చిరిగిఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్య అవకాశాన్ని తోసిపుచ్చలేమని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తల్కటోరా ప్రాంతానికి చెందిన యువతి జులై 21న నర్స్ ట్రైనింగ్ కోసం మెదాంత ఆస్పత్రిలో చేరి గోమతి నగర్లోని హాస్టల్లో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఇక మృతదేహం వద్ద ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడం, మృతురాలి శరీరంపై గాయాల గుర్తులు లేకపోవడం పలు సందేహాలు రేకెత్తిస్తోంది.