న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో యాపిల్ ఐఫోన్స్ ముందువరసలో ఉంటాయి. ఐఫోన్లకు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు స్కామర్లు గ్యాంగ్లుగా ఏర్పడి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. చవకైన ఫోన్లకు ఐఫోన్ 13 లేబుల్తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. మెరుగైన ఫీచర్లు, అద్భుత స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియన్స్ను అందించే ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ భారత్లో దాదాపు రూ. లక్ష రిటైల్ ధర పలుకుతున్నాయి.
ఐఫోన్లకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లో వీటికి నకిలీలూ పోటెత్తుతున్నాయి. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇటీవల ఫేక్ ఐఫోన్ 13 మోడల్స్ విక్రయిస్తున్నా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తక్కువ ధరకు ఐఫోన్ 13 ఫేక్ మోడల్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను నోయిడా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు 60 ఫేక్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ ఢిల్లీ నుంచి రూ . 12,000కు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి ఆపై ఐఫోన్ బాక్స్ల్లో ఫేక్ మొబైల్ ఫోన్లను ప్యాక్ చేసి అయినకాడికి అమ్మేస్తున్నారు.
ఈ గ్యాంగ్ చైనీస్ ఆన్లైన్ రిటైలర్ నుంచి నిజమైన ఐఫోన్ బాక్స్లను కొనుగోలు చేస్తోంది. యాపిల్ స్టిక్కర్లను ఒక్కోటి రూ వేయికి కొనుగోలు చేసి నకిలీ యాపిల్ ప్యాకేజింగ్తో ఫేక్ ఫోన్లను రూ . 53,000కు విక్రయిస్తోంది. ప్యాకింగ్ ఐఫోన్లను పోలిన విధంగా ఉండటంతో ప్రజలు తక్కువ ధరకే యాపిల్ ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపడంతో స్కామర్లు సులభంగా మోసగిస్తున్నారు. అధికారిక రిటైలర్ల వద్దే కొనుగోలు చేయాలని స్మార్ట్ఫోన్ తయారీదారులు ప్రజలను కోరుతున్నారు. కొనుగోలు చేసే ముందు కస్టమర్లు అవి అసలైనవా లేక నకిలీవా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.