బంజారాహిల్స్ : ఉన్నత చదువుల కోసం కావాల్సిన డబ్బులు తల్లి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని నూర్నగర్లో నివాసం ఉంటున్న కే.దివ్యశ్రీ (19) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. నెలరోజుల క్రితం తాను పీజీ చేయాలనుకుంటున్నానని, రూ.60వేలు కావాలంటూ తల్లి ధనలక్ష్మిని కోరింది. అయితే ఇడ్లీలు అమ్ముకుని జీవిస్తున్న తనవద్ద రూ.60వేలు లేవని తల్లి చెప్పింది.
దీంతో మనస్థాపానికి గురైన దివ్య గత నెల 31న ఆల్ అవుట్ లిక్విడ్ తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన దివ్యశ్రీని కుటుంబ సభ్యులు బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివ్యశ్రీని మెరుగైన చికిత్సకోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందింది.
ఈ మేరకు తల్లి ధనలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.