హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను నార్కొటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. అతని వద్ద లభించిన కోట్ల విలువైన డ్రగ్స్, తొమ్మిది మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని వెల్లడించారు. 2015లో కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడని చెప్పారు.