భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డాబ్రా నివాసి వీరేంద్ర జాతవ్తో శశికి వివాహం జరిగింది. జూన్ 27న తండ్రి నుంచి రూ.3 లక్షల కట్నం తీసుకురావాలని భార్యను వీరేంద్ర డిమాండ్ చేశాడు. దీనికి శశి నిరాకరించడంతో ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. వీరేంద్ర తల్లి, సోదరి దీనికి సహకరించారు. యాసిడ్ తాగించిన శశిని గ్వాలియర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 50 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు గురువారం మరణించింది.
అయితే దీనికి ముందు జరిగిన విషయాన్ని బాధితురాలు వీడియో రికార్డ్ చేసింది. నిందితులైన భర్త, అత్త, ఆడపడుచును వదిలిపెట్టవద్దని ఒక సందేశంలో పోలీసులను శశి కోరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో హత్య సెక్షన్ను కూడా కలిపి నిందితులను అరెస్ట్ చేసినట్లు గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. తొలుత దర్యాప్తు సరిగా చేయని ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మరోవైపు ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మహిళా కమిషన్ కోరింది.