విదిశ: రైలు ఓ జంక్షన్ దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిపోయింది. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్లో ఉంది. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడనేపడింది. రైలూ కదిలింది. సరిగ్గా అప్పుడే ఓ 30 ఏండ్ల మహిళ తన ఎదురుగా ఉన్న యువకుడిపై యాసిడ్ చల్లి, రైల్లోంచి దూకి పారిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలోని గంజ్బసోడా రైల్వేస్టేషన్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో బాధిత యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ సందర్భంగా యాసిడ్ పడి బోగిలో మంటలు చెలరేగాయి. దాంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కొందరు ప్రాణ భయంతో రైల్లోంచి దూకారు. దాంతో వాళ్లకూ తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రైలు భోపాల్ నుంచి దామోహ్కు వెళ్తుండగా ఘటన జరిగిందని చెప్పారు. బాధితుడు సచిన్ సాహుగా గుర్తించారు. యాసిడ్ దాడికి పాల్పడిన గుర్తు తెలియని మహిళ జాడ కోసం వెతుకుతున్నారు.