వెంగళరావునగర్ : తల్లి మందలించిందని మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేట దరంకరం రోడ్డు, హరిజన బస్తీకి చెందిన ఎ.ఆముదాలు భర్త లక్ష్మణ్ కొంతకాలం క్రితం మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు.
రెండవ కుమారుడైన ఎ.క్రాంతికుమార్ (27) తరచూ మిత్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్తుండేవాడు. తల్లి ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో గత నెల రోజుల క్రితం ఈ విషయంపై తల్లి క్రాంతికుమార్ను తీవ్రంగా మందలించింది. అప్పటి నుంచి మనస్తాపంతో ముభావంగా ఉంటున్నాడు. ఎవరితోనూ మట్లాడేవాడు కాదు.
కాగా సోమవారం తెల్లవారుజామున ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 8 గంటలకు నిద్ర లేసిన కుటుంబ సభ్యులకు క్రాంతి కుమార్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపిండంతో కిందకు దించి స్థానికంగా ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు తల్లి ఆముదాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.