27 రోజుల పసికందు తల గోడకేసి కొట్టి చంపేసిందో తల్లి. ఈ భయానక ఘటన కేరళలో వెలుగు చూసింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతోనే ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఆ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో బాబును తీసుకొని ఆస్పత్రుల చుట్టూ తిరగడమే ఆ తల్లి పనైంది.
కొన్నిరోజుల క్రితం అలాగే శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిందా తల్లి. పరీక్షలు చేసిన వైద్యులు.. కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడినా కూడా ఆ బిడ్డ అనారోగ్యం తగ్గలేదు. దీంతో గుక్కపట్టి ఏడవసాగాడు. ఆ తర్వాత కాసేపటికి ఆ శిశువు పరిస్థితి మరింత విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ బిడ్డ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది.
ఆ ఆశ్రమం నడిపే ఫాదర్ జోజి థామస్కు శిశువు మృతిపై ఏదో అనుమానం కలిగింది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. బిడ్డ తల్లి తన ప్రియుడితో కలిసి ఆశ్రమంలో ఉంటోందని సమాచారం. పెళ్లయిన వ్యక్తితో పరిచయం పెరగడంతో వాళ్లిద్దరూ కలిసి ఆ ఆశ్రమంలో ఉంటున్నారు.
వీరికి పుట్టిన శిశువు చాలా బలహీనంగా ఉండి, ఇబ్బందులు పెడుతున్నాడని ఆ తల్లే బిడ్డను చంపేసిందని దర్యాప్తులో తేలింది. శిశువు తలపై కూడా గట్టి దెబ్బలు ఉన్నట్లు పోలీసులు వివరించారు. పై చదువులు చదవాలని అనుకుంటున్న ఆ యువతి.. పిల్లాడు ఏడుస్తూ తనను చదువుకోనివ్వడం లేదని, అలాగే చదువుకు భవిష్యత్తులో కూడా అడ్డంకిగా మారతాడని భావించి బిడ్డను చంపేసినట్ల తెలుస్తోంది.