పెళ్లికాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఒక యువతి. ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకునేందుకు ఆమె మరో ఘోరం చేసింది. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలనుకున్న ఆమె చేతనే మరో తప్పు చేయించి ఆమె బండారం బయటపెట్టింది.
వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయు వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారశుద్ధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్రూంలో క్లీనింగ్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ టాయ్లెట్ ఫ్లష్ ట్యాంకు సరిగా పనిచేయకపోయడంతో అతను దానిని తెరిచి చూడగా అందులో ఒక పసిబిడ్డ శవం కనిపించింది. దీంతో అతడు ఆస్పత్రి యాజమాన్యానికి ఈ విషయం తెలియజేశాడు.
ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా.. వారు విచారణ కోసం ఆస్పత్రిలో ఎవరెవరికి ప్రసవం జరిగిందో వారి వివరాలు అడిగారు. కానీ ఆ ఆస్పత్రిలో ప్రసూతి గది(మెటర్నిటి వార్డు) లేదని యాజమాన్యం తెలిపింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు సీసీటీవి వీడియోలను పరిశీలించారు. అందులో ఒక అనుమాస్పద మహిళను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని(23) అనే యువతి పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందనే భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు నిర్ణయించుకుని.. ఆమె దెగ్గరలోని తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ దొంగచాటుగా బాత్రూంకి వెళ్లి టాయ్లెట్ ఫ్లష్ ట్యాంకులో ఆ పని బిడ్డను పెట్టేసి దానిని ట్యాంకును మూసి వేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.