పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న రక్కసికి తల్లీబిడ్డలు బలయ్యారు. వరకట్న వేధింపులు తాళలేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని భూమ్ నగమ్ లో నివసిస్తున్న చిగుర్ల మౌనిక (26) తన (18) నెలల కూతురు జున్నుతో కలిసి ఎల్లమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేశ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన మౌనికకు సివిల్ సప్లయ్ లో కాంట్రాక్టు పద్ధతిలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమేశ్ తో వివాహమైంది.
వివాహం జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం రమేశ్ మౌనికను వేధించేవాడని సమాచారం. బుధవారం ఉదయం కూడా ఇదే విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మౌనిక చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మౌనిక గర్భవతి కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.