లక్నో : రెండు నెలల కిందట అదృశ్యమైన ఉన్నావ్కు చెందిన దళిత మహిళ (22) మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం వద్ద కనిపించడం కలకలం రేపింది. దర్యాప్తులో అలసత్వం వహించిన స్ధానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)ను అధికారులు సస్పెండ్ చేశారు. మహిళ కిడ్నాప్ కేసులో ఎస్పీ మాజీ మంత్రి దివంగత ఫతే బహుదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ను జనవరి 24న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ ఎదుట ఇటీవల ఆత్మహత్యా యత్నం చేయడంతో కేసులో కదలిక వచ్చింది. స్ధానిక ఎస్హెచ్ఓ అఖిలేష్ చంద్ర పాండే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
డిసెంబర్ 8న మహిళ అదృశ్యంపై ఫిర్యాదు రాగా జనవరి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇటీవల బాధితురాలి మృతదేహం లబించిందని ఉన్నావ్ ఏఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని మహిళ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, అతడి అనుచరుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు తమ కుమార్తెను రాజోల్ సింగ్ తన ఆశ్రమంలో హత్య చేసి పాతిపెట్టాడని బాధితురాలి తల్లి ఆరోపించారు.
తాను ఆశ్రమానికి వెళ్లగా ఆశ్రమం అంతటినీ తనకి చూపారని, కానీ అక్కడే ఉన్న మూడంతస్తుల భవనంలోకి వెళ్లనీయలేదని చెప్పారు. స్ధానిక పోలీస్ అధికారికి తాను ఫోన్ చేయగా ఆయన ఫోన్ స్విచాఫ్ చేశాడని ఆరోపించారు. ఆరోజు ఆయన వచ్చిఉంటే తన కూతురిని సజీవంగా కాపాడుకునేవారమని అన్నారు. ఇక ఈ ఘటనను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ తీవ్రంగా ఖండించారు. నిందితులు రాజోల్ సింగ్తో పాటు దర్యాప్తులో అలసత్వం వహించిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.