పట్నా : సామూహిక లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించడంతో బాలిక(17)పై ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేసిన ఉదంతం బిహార్లోని బిగుసరై జిల్లా దండారి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాలిక ఫోన్కాల్ రావడంతో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని అరగంట తర్వాత గ్రామంలోని రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్నట్టు తెలిసిందని బాలిక తల్లి పేర్కొన్నారు.
బాలికకు చివరిసారిగా ఓ బాలుడి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఆదివారం బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలిక తన స్నేహితుడు రౌషన్ కుమార్ కాల్ చేయడంతో శనివారం గ్రామంలోని స్కూల్ వద్ద అతడిని కలిసేందుకు వెళ్లింది.
వారు మాట్లాడుకుంటుండగా కొందరు బాలురు పసిగట్టారు. ముగ్గరు బాలురు వారి వద్దకు రావడం గమనించిన రౌషన్ అక్కడినుంచి పారిపోగా బాలికను పట్టుకున్న దుండగులు ఆమెను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారు. వారిని ప్రతిఘటించిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో బాలికను స్పృహ కోల్పోయేవరకూ కత్తితో పొడిచారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.