న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేండ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను పొరుగున ఉండే ఇద్దరు మైనర్ బాలురు సమీపంలో ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగివచ్చిన అనంతరం కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి ఏమైందని అడగ్గా జరిగిన విషయం వెల్లడించింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు బాలురను మంగళవారం అరెస్ట్ చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు.
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ బాలిక పట్ల నిందితులు మృగాల్లా వ్యవహరించారని వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.