భోపాల్ : తమ కుటుంబానికి చెందిన మహిళ ఓ యువకుడితో పారిపోయేందుకు సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా బర్హో గ్రామంలో వెలుగుచూసింది. బాలిక ప్రస్తుతం చిత్రకూట్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ పొరుగున ఉండే సుమర్ సింగ్, గోల్డీలు తమ ఇంటికి వచ్చి మాట్లాడాలని తనను, సోదరుడిని వారి ఫాంహౌస్కు తీసుకువెళ్లారని అక్కడికి వెళ్లిన తర్వాత తనను వేధింపులకు గురిచేసి కళ్లలో యాసిడ్ చల్లారని బాలిక ఆరోపించింది.
సోదరుడిని గాయపరిచారని, ఆపై పొలంలో పడిపోయిన తనను చూసిన స్ధానికులు ఆస్పత్రికి తరలించారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్నాధ్ స్పందించారు. ఈ ఘటన సిగ్గుచేటని నిందితులపై కఠినచర్యలు చేపట్టాలని, బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. కాగా బాలిక కంటికి ఎలాంటి ప్రమాదం లేదని ఆమె చూపు కోల్పోయే పరిస్ధితి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.