ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీనగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఒక ఇంటి నుంచి భారీ ఎత్తున బంగారు, నగదు చోరీకి గురయ్యాయి. మాణికేశ్వరీనగర్లో నివాసముండే రంగమ్మకు సంతానం లేకపోవడంతో దగ్గర బంధువును దత్తత తీసుకుంది.
అందరూ కలిసి మాణికేశ్వరీనగర్లోని ఇంటిలోనే నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్తూ, దత్తపుత్రుడిని ఇళ్లు చూసుకోవలసిందిగా సూచించింది. అదేరోజు రాత్రి ఇంటికి తిరిగిరాగా, తొంభై తులాల వడ్డాణం, ఇరవై తులాల చెయిన్, రూ. నాలుగు లక్షల నగదు కనిపించలేదు.
దాంతో వెంటనే ఆమె ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దత్తపుత్రుడే ఈ చోరీకి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి వివరాలు బహిర్గతం చేయకపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.