Blast @ Tata Steel | జార్ఖండ్లోని జంషెడ్పూర్లో టాటా స్టీల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 10.20 గంటలకు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరో కార్మికుడికి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పారు. మిగతా ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని టాటా స్టీల్ తెలిపింది. చికిత్స కోసం దవాఖానకు తరలించామని వివరించింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టాటా స్టీల్స్ యాజమాన్యం కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
టాటా స్టీల్ ఫ్యాక్టరీలోని బ్యాటరీ కోక్ ప్లాంట్లోని ఫౌల్ గ్యాస్ లైన్లో పేలుడు చోటు చేసుకుంది. అయితే, ఈ ప్లాంట్ నాన్ ఆపరేషనల్, దీన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని టాటా స్టీల్ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి.
ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ స్పందించారు. జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవడానికి టాటా స్టీల్ మేనేజ్మెంట్తో సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది అని ట్వీట్ చేశారు.
జంషెడ్పూర్లో టాటా స్టీల్ ప్లాంట్ తరహాలోనే ముంబై విలే పార్లెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ఎస్వీ రోడ్లోని విలే పార్లె వెస్ట్లో గల ఎల్ఐసీ ఆఫీసులో ఈ ప్రమాదం జరిగింది.అయితే, ఎవరికి గాయాలు కాలేదు. ప్రాణనష్టం జరుగలేదు.తమ ఎస్ఎస్ఎస్ డివిజనల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇది కేవలం రెండో అంతస్తుకు పరిమితమైందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.