లక్నో : నేర రాజధానిగా మారిన యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో మరదలిని నిర్బంధించి ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మీరట్ జిల్లాలో కలకలం రేపింది. నిందితుడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఆదివారం తల్లితండ్రుల చెంతకు చేరి జరిగిన విషయం వెల్లడించడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హపూర్కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కిందట మీరట్లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. కొన్నేండ్ల కిందట ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెలల కిందట మహిళ చెల్లెలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాలిక తాను పనిమీద బయటకు వచ్చిన సమయంలో తన బావ మాయమాటలు చెప్పి తనను తీసుకువెళ్లాడని, మత్తుమందు కలిపిన ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.