ముంబై: మద్యం తాగిన తర్వాత డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మహిమ్ ప్రాంతంలో గురువారం ఒక వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ వ్యక్తి ఒంటిపై కత్తిపోటు గాయాలున్నట్లు గమనించారు. మృతుడ్ని 29 ఏళ్ల గణేష్ అలియాస్ ఆకాష్ భలేరోగా గుర్తించారు. అతడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కాగా, గణేష్ను హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తెగ ప్రయత్నించారు. సుమారు 136 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చివరకు అసలు నిందితుడైన 42 ఏళ్ల వ్యక్తిని శనివారం దాదర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. స్నేహితుడైన గణేష్ను తానే హత్య చేసినట్లు అతడు తెలిపాడు.
తామిద్దరం కలిసి తరచుగా మద్యం తాగేవాళ్లమని నిందితుడు చెప్పాడు. అయితే ఆ రోజు రాత్రి మద్యం సేవించిన తర్వాత బిల్లు కట్టే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన తాను గణేష్ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.