లక్నో : యూపీలో దురహంకార హత్య కలకలం రేపింది. తన సోదరి వేరొకరితో సన్నిహితంగా మెలుగుతుందనే ఆగ్రహంతో ఆమెను నాటుతుపాకీతో కాల్చి పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి ఉదంతం మీరట్ జిల్లాలోని సర్దనాలో వెలుగుచూసింది. సోదరి ఎఫైర్ పట్ల ఆగ్రహంతోనే ఆమెను మట్టుబెట్టానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని ఆరిష్, బాధితురాలిని సమ్రీన్ (22)గా గుర్తించారు. ఆరిష్ను అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సమ్రీన్ స్దానికంగా ఉండే ఓ వ్యక్తితో అఫైర్ నడిపిస్తుండగా ఈ వ్యవహారంపై ఆరిష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. అతడికి దూరంగా ఉండాలని కుటుంబ సభ్యుల సూచనను ఖాతరు చేయని సమ్రీన్ ప్రియుడితో ఫోన్లో మాట్లాడటం కొనసాగించడం ఆరిష్కు ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సమ్రీన్ నిద్రిస్తుండగా ఆమె తలపై కాల్పులు జరిపిన ఆరిష్ ఆపై పోలీసులకు లొంగిపోయాడు. సమ్రీన్ ఘటనా స్థలంలోనే మరణించింది.