లక్నో: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతున్నాడని భార్య పుట్టింటికి వెళ్లి కొన్ని నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో.. ఆగ్రహానికిలోనైన భర్త ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టి ఆపై తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లా ఈషాపూర్ ధోభా గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఫర్ధాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుత్నా గ్రామానికి చెందిన అజయ్ (28), రోమాదేవి (26) దంపతులు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య కుటుంబతగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం రోమాదేవి భర్తతో గొడవపడి ఈషాపూర్ ధోభాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో ఆగ్రహానికి గురైన అజయ్ శనివారం ఉదయం ఓ కిరోసిన్ క్యాన్ తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు.
రోమాదేవి కుటుంబసభ్యులు అజయ్ రాకను గమనించి అతను ఏం చేస్తున్నాడో గ్రహించేలోపే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటింది, తానూ నిప్పంటించుకున్నాడు. మంటలను ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.