ముంబై : భార్య ప్రవర్తనపై అనుమానంతో రగిలిన భర్త ఆమెను కత్తిపోట్లకు గురిచేసి కడతేర్చిన కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. 2017లో ఓ అర్ధరాత్రి భార్యపై నిందితుడు అక్తర్ ఖాన్ కత్తితో దాడి చేసి ఉసురుతీశాడు. అల్లుడు ఫిర్యాదు ఆధారంగా అక్తర్ ఖాన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అక్తర్ ఖాన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో తరుచూ ఆమెతో గొడవపడేవాడని అల్లుడు ఆరోపించాడు.
2017, జూన్ 13న అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని వారి ఇంటి నుంచి అరుపులు వినపడటంతో అక్కడికి సమీపంలో నివసించే తాను వారి ఇంటికి వెళ్లానని చెప్పాడు. అప్పుడు రక్తపు మరకలైన దుస్తులతో అక్తర్ ఖాన్ బయటకు వచ్చాడని లోపలికి వెళ్లి చూడగా అత్త రక్తపు మడుగులో పడి ఉందని కోర్టులో వివరించాడు. బాంద్రాలోని బాబా ఆస్పత్రికి ఆటోలో తరలిస్తుండగా తాగిన మైకంలో భర్త తనపై దాడి చేశాడని ఆమె తనకు తెలిపిందని చెప్పాడు.
జూన్ 14న అక్తర్ ఖాన్ రక్తపు మరకలున్న కత్తి, దుస్తులతో పోలీసులకు పట్టుబడ్డాడు. దర్యాప్తు సందర్భంగా తాను హత్య చేయలేని అక్తర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఆపై 11 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టులో ప్రవేశపెట్టింది. రికార్డుల్లో నమోదైన ఆధారాలు, పరిస్ధితులు నిందితుడిని దోషిగా స్పష్టం చేస్తున్నాయని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్వీ తివారీ పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందో బాధితురాలు తన అల్లుడితో చెప్పిందని ఆటో డ్రైవర్ కోర్టుకు నివేదించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అక్తర్ ఖాన్కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు న్యాయయూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.