పట్నా : తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పది మందితో కలిసి తన ఇంట్లోనే రూ 4 లక్షల విలువైన వస్తువులను లూటీ చేస్తుండగా గ్రామస్తులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముసుగు తొలగించి చూస్తే నిందితుడు ఇంటి యజమాని కుమారుడే కావడంతో వారు కంగుతిన్నారు. నిందితుడు నూర్ ఆలం కిషన్ గంజ్కు చెందిన బాలికను వివాహం చేసుకున్నాడు.
ప్రేమ వివాహం అతడి తల్లితండ్రులకు నచ్చకపోవడంతో వారు అతడిని ఇంటి నుంచి బయటకు పంపారు. ఆలం అప్పటినుంచి అత్తగారింట్లో ఉంటున్నాడు. ఆస్తిలో తన వాటా తనకు ఇచ్చేయాలని కోరుతున్నా తల్లితండ్రులు వాటా పంచకపోవడంతో సొంత ఇంట్లోనే చోరీకి స్కెచ్ వేశాడు. దొంగలను గ్రామస్తులు చుట్టుముట్టగా ఆలం ఒక్కడే పట్టుబడగా మిగిలిన వారు పరారయ్యారు.