ఒక వ్యక్తి ఉపయోగిస్తున్న బైక్ పోయింది. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు సడెన్గా అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. తీరాచూస్తే.. అతని బైక్ను పోలీసులే నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలింది.
ఈ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వెలుగు చూసింది. ఇమ్రాన్ అనే వ్యక్తి నడిపే హోండా సీడీ 70 బైక్.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా రికవరీ జరగలేదు. ఆశలు వదిలేసుకొని అతను తన జీవనం సాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది.
దానికి సంబంధించిన ఫొటోలో.. పోలీసులే తన బండి నడుపుతూ కనిపించడంతో ఇమ్రాన్ ఆశ్చర్యపోయాడు. నేరుగా వెళ్లి చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్ (సీసీపీఓ)కి ఫిర్యాదు చేసి, తన బైక్ తనకు ఇప్పించాలని కోరాడు.