ముంబై : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆన్లైన్ మోసాలపై పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో సైబర్ మోసగాళ్లకు అమాయకులు బలవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఓ రిటైర్డ్ అధికారి తన సేవింగ్స్, పదవీవిరమణ ప్రయోజనాలతో పాటు అప్పులు చేసి తీసుకువచ్చిన సొమ్మంతా సైబర్ నేరగాళ్ల మాయాజాలంతో పోగొట్టుకున్నారు. ఆన్లైన్లో సంపాదనా మార్గాలు చూపుతామని నమ్మబలికిన స్కామర్లు పుణేలోని హదస్పర్ ప్రాంతానికి చెందిన బాధితుడి (64) నుంచి ఏకంగా కోటి రూపాయలు కొట్టేశారు.
ఆన్లైన్లో అదనంగా కొంత డబ్బు సంపాదించవచ్చని సైబర్ నేరగాళ్లు బాధితుడిని ముగ్గులోకి దించారు. ఫిబ్రవరి 13 నుంచి 26 మధ్య ఈ ఘటన జరగ్గా బాధితుడు ఇటీవల పుణే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ప్రకారం బాధితుడు గత ఏడాది గ్రూప్ చాటింగ్ను అనుమతించే ఓ మెసేజింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. గ్రూప్లో కొందరితో కనెక్ట్ అయిన తర్వాత కొన్ని సింపుల్ ఆన్లైన్ టాస్క్ల ద్వారా ఆకర్షణీయ మొత్తం సంపాదించవచ్చని ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాధితుడు మెసేజ్ అందుకున్నాడు.
దీనికోసం ఓ వీడియో షేరింగ్ ప్లాట్పాం లింక్ బటన్ను క్లిక్ చేయాలని బాధితుడికి ఓ లింక్ వచ్చింది. ఈ టాస్క్ పూర్తిచేసిన తర్వాత బాధితుడికి కొంత సొమ్ము అందడంతో పాటు వెల్కమ్ బోనస్ అందించారు. ఇక ప్రీపెయిడ్ టాస్క్ కోసం రూ. 1000 చెల్లించాలని కోరగా బాధితుడు ఆ మొత్తం చెల్లించి టాస్క్ పూర్తి చేసిన తర్వాత భారీ మొత్తం ఆఫర్ చేశారు. ఇక మరిన్ని ప్రీపెయిడ్ టాస్క్లు చేస్తే భారీ రిటన్స్ వస్తాయని మోసగాళ్లు బాధితుడిని ప్రలోభపెట్టారు.
ఆపై తన వద్ద ఉన్న మొత్తం నగదు, సేవింగ్స్ను డిపాజిట్ చేస్తూ నష్టపోయాడని సైబర్ పోలీస్ సీనియర్ ఇన్స్పెక్టర్ మీనల్ పాటిల్ తెలిపారు. స్కామర్లను గుడ్డిగా నమ్మిన బాధితుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్, సేవింగ్స్ కలిపి రూ. 60 లక్షలతో పాటు కుమారుడి నుంచి తీసుకున్న రూ. 40 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు డిపాజిట్ చేసిన మొత్తం నగదు ఐదు బ్యాంకుల్లోని 12 ఖాతాలకు వెళ్లినట్టు దర్యాప్తులో సైబర్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More