బెంగళూర్ : గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fruad) విచ్చలవిడిగా వెలుగుచూస్తున్నాయి. రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్న స్కామర్లు అమాయకులే లక్ష్యంగా ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్నారు. లేటెస్ట్గా బెంగళూర్కు చెందిన 66 ఏండ్ల సీనియర్ సిటిజెన్నూ సైబర్ నేరగాళ్లు మోసగించారు. కొరియర్ స్కామ్లో ఆయన నుంచి రూ. 1.52 కోట్లు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన దేవశిష్ దాస్కు కార్తికేయ అని పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది.
తైవాన్కు గడువు ముగిసిన ఐదు పాస్పోర్టులు, క్రెడిట్ కార్డులు, మాదక ద్యవ్యాల వంటి వస్తువులతో కూడిన కొరియర్ పంపినందుకు ముంబైలో దాస్పై కేసు నమోదైందని సదరు వ్యక్తి బాధితుడిని బెదరించాడు. అంధేరి పోలీస్ అధికారితో స్కైప్ కాల్లో మాట్లాడాలని సూచించారు. స్కామర్లు పంపిన్ లింక్ ద్వారా ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్గా చెప్పుకున్న ప్రదీప్ సావంత్తో బాధితుడిని మాట్లాడించారు. దాస్ పేరిట మనీల్యాండరింగ్ కోసం నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచారని సావంత్ నమ్మబలికారు.
దాస్ పేరును క్లియర్ చేసేందుకు తన బ్యాంక్ ఖాతాల వివరాలను డీసీపీకి అందచేయాలని స్కామర్లు మభ్యపెట్టారు. ఇక డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి దాస్ను తన ఫిక్సడ్ డిపాజిట్స్, సేవింగ్స్ ఖాతాలన్నింటినీ క్లోజ్ చేసుకుని ప్రత్యేక బ్యాంక్ ఖాతాకు తరలించాలని సూచించాడు. దీంతో ఎస్బీఐ ఖాతాల్లోని రూ. 1.52 కోట్లను స్కామర్లు సూచించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అరగంటలో ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తామన్న స్కామర్లు ఎంతసేపటికీ పత్తా లేకుండా పోవడంతో మోసపోయానని గ్రహించిన దాస్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!