ముంబై : ఆన్లైన్ స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud )చెలరేగుతూనే ఉన్నారు. రూటు మార్చి వినూత్న పోకడలతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. యూజర్ల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోంచి నగదును ఊడ్చేస్తున్నారు.
ఇక లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో మద్యం కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇస్తూ స్కామర్ల చేతిలో మోసపోయాడు. బాధితుడి నుంచి స్కామర్లు ఏకంగా రూ. 1.2 లక్షలను కొట్టేశారు. ముంబైలోని మలబార్ హిల్స్కు చెందిన వ్యక్తి (49) ఆన్లైన్ వేదికలపై లిక్కర్ స్టోర్స్ గురించి సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో ఓ లీగల్ సంస్ధలో టెక్నీషియన్గా పనిచేసే బాధితుడు దక్షిణ ముంబైకి చెందిన పీకే వైన్స్ కాంటాక్ట్ నెంబర్ను సేకరించాడు. ఆ నెంబర్కు కాల్ చేసిన వ్యక్తి లిక్కర్ బాటిల్కు ఆర్డర్ ఇచ్చాడు.
ఆర్డర్ కోసం బిల్లు ఇచ్చేందుకు ఓటీపీ చెప్పాలని వైన్స్ నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మబలికిన వ్యక్తి కోరాడు. తన మొబైల్ ఫోన్కు వచ్చిన ఓటీపీని బాధితుడు షేర్ చేయగానే స్కామర్ అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 1.2 లక్షలు దోచేశాడు. ఈ లావాదేవీపై బాధితుడు మలబార్ హిల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆన్లైన్ స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీపక్ వైన్స్, షా వైన్స్, పీకే వైన్స్ వంటి పేర్లతో స్కామర్లు తమ మొబైల్ నెంబర్లను పోస్ట్ చేస్తున్నారని తెలిపారు.
Read More :