ముంబై: ఒక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోందా అమ్మాయి. ఎప్పట్లాగే ఉద్యోగానికి ఆటోలో బయలు దేరింది. ఆ ఆటోను వెంబడించిన ఒక వ్యక్తి.. దారి మధ్యలో ఆటోను అడ్డగించాడు. ఆమెను బయటకు పిలిచి ఏదో విషయంలో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.
అంతే తన దుస్తుల్లో దాచిన కత్తి తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడా దుర్మార్గుడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధారి ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఆకాంక్ష సురేష్ ఖరాట్మల్ అనే 21 ఏళ్ల యువతి ఒక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. 2019లో ఆమె అక్షయం అథవాలే (24) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాంద్రాలోకి ఒక కోర్టు ప్రాంగణంలో వీరి వివాహం జరిగింది.
అయితే ఆ తర్వాత కొంతకాలానికే వీరి సంసారం ముక్కలైంది. గొడవలు భరించలేని ఆకాంక్ష పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెను మళ్లీ ఇంటికి తెచ్చుకోవడానికి అక్షయ్ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. దీనిలో భాగంగానే బుధవారం నాడు ఆమె ఆఫీసుకు వెళ్తుండగా వెంబడించాడు. ఆటో ఆపి ఆమెతో గొడవ పడ్డాడు.
ఈ సమయంలోనే తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె శరీరంపై 12 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడైన అక్షయ్ పారిపోయే ప్రయత్నమేమీ చేయలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.