శేరిలింగంపల్లి : రెడీమిక్స్ వాహనం ఢీకొని ఓ సెంట్రింగ్ మేస్త్రీ మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుల్మోహార్ పార్క్ నేతాజీనగర్కాలనీలో నివసించే ఎం.కృష్ణ (55) సెంట్రింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం మద్యాహ్నాం 12 గంటల సమయంలో నేతాజీనగర్ కాలనీ నుంచి కొండాపూర్ మజీద్బండా వైపు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. మార్గమద్యలో మజీద్బండా ఎస్ఎంఆర్ వినమ్ బహుళ అంతస్ధుల నిర్మాణం వద్ద టీ జంక్షన్కు చేరుకున్నాడు.
అ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎంఆర్ వినమ్ బహుళ అంతస్థుల నుంచి హైటెన్షన్ లింకురోడ్డు మీదుగా సమీపం లోని సంస్థ రెడీమిక్స్ మిక్సింగ్ ప్లాంట్కు రెడీమిక్స్ వాహనం వేగంగా జంక్షన్కు చేరుకొని కృష్ణ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రెడీమిక్స్ వాహనం వెనకచక్రాల కిందపడిన కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.